సంఖ్యాకాండం
13 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 2 “నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న కనాను దేశాన్ని వేగుచూడడానికి మనుషుల్ని పంపించు. వాళ్ల పూర్వీకుల గోత్రాల్లో ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని పంపించాలి, వాళ్లలో ప్రతీ ఒక్కరు తన గోత్రంలో ప్రధానుడై+ ఉండాలి.”+
3 కాబట్టి మోషే యెహోవా ఆదేశం మేరకు పారాను ఎడారి+ నుండి వాళ్లను పంపించాడు. వాళ్లందరూ ఇశ్రాయేలీయుల పెద్దలే. 4 వాళ్లు ఎవరంటే: రూబేను గోత్రం నుండి జక్కూరు కుమారుడైన షమ్మూయ; 5 షిమ్యోను గోత్రం నుండి హోరీ కుమారుడైన షాపాతు; 6 యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;+ 7 ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కుమారుడైన ఇగాలు; 8 ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడైన హోషేయ;+ 9 బెన్యామీను గోత్రం నుండి రాఫు కుమారుడైన పల్తీ; 10 జెబూలూను గోత్రం నుండి సోరీ కుమారుడైన గదీయేలు; 11 యోసేపు+ కుమారుడైన మనష్షే+ గోత్రం నుండి సూసీ కుమారుడైన గదీ; 12 దాను గోత్రం నుండి గెమలి కుమారుడైన అమ్మీయేలు; 13 ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కుమారుడైన సెతూరు; 14 నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కుమారుడైన నహబీ; 15 గాదు గోత్రం నుండి మాకీ కుమారుడైన గెయువేలు. 16 ఇవి కనాను దేశాన్ని వేగుచూడడానికి మోషే పంపించిన వాళ్ల పేర్లు. అయితే నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ*+ అని పేరు పెట్టాడు.
17 కనాను దేశాన్ని వేగుచూడడానికి వాళ్లను పంపిస్తున్నప్పుడు మోషే వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు నెగెబుకు చేరుకొని, అక్కడి నుండి కొండ ప్రాంతానికి వెళ్లండి.+ 18 మీరు దాన్ని చూసి, అది ఎలాంటి దేశమో,+ అక్కడ నివసించే ప్రజలు బలవంతులో బలహీనులో, వాళ్లు ఎక్కువమంది ఉన్నారో తక్కువమంది ఉన్నారో, 19 అది మంచి దేశమో కాదో, వాళ్లు నివసిస్తున్న నగరాలకు ప్రాకారాలు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. 20 అది సంపన్న దేశమో పేద దేశమో,+ దానిలో చెట్లు ఉన్నాయో లేవో చూడండి. మీరు ధైర్యంగా ఉండాలి,+ అలాగే ఆ దేశంలోని పండ్లలో కొన్ని తీసుకురావాలి.” అది ద్రాక్షల ప్రథమఫలాల కాలం.+
21 కాబట్టి వాళ్లు వెళ్లి సీను ఎడారి+ నుండి లెబో-హమాతు*+ దగ్గరున్న రెహోబు+ వరకు ఆ దేశాన్ని వేగుచూశారు. 22 వాళ్లు నెగెబులోకి వెళ్లి అనాకీయులైన+ అహీమాను, షేషయి, తల్మయి+ నివసిస్తున్న హెబ్రోను+ నగరానికి వచ్చారు. ఈ హెబ్రోను నగరం, ఐగుప్తుకు చెందిన సోయను కన్నా ఏడేళ్లు ముందే నిర్మించబడింది. 23 వాళ్లు ఎష్కోలు లోయకు* వచ్చినప్పుడు, ద్రాక్ష గుత్తి ఉన్న ఒక తీగను కోశారు; దాన్ని ఇద్దరు వ్యక్తులు మోతకర్ర మీద మోయాల్సి వచ్చింది. అలాగే వాళ్లు కొన్ని దానిమ్మ పండ్లను, అంజూర పండ్లను కూడా కోశారు. 24 ఇశ్రాయేలీయులు అక్కడ ద్రాక్ష గుత్తిని కోశారు కాబట్టి వాళ్లు ఆ స్థలానికి ఎష్కోలు* లోయ*+ అని పేరు పెట్టారు.
25 వాళ్లు ఆ దేశాన్ని వేగుచూసి 40 రోజుల+ తర్వాత తిరిగొచ్చారు. 26 వాళ్లు కాదేషు+ దగ్గరికి, అంటే పారాను ఎడారిలో మోషే, అహరోను, ఇశ్రాయేలీయుల సమాజమంతా ఉన్న చోటికి తిరిగొచ్చారు. వాళ్లు ఆ సమాజమంతటి కోసం నివేదికను తీసుకొచ్చారు, ఆ దేశంలోని పండ్లను వాళ్లకు చూపించారు. 27 వాళ్లు మోషేకు ఇలా చెప్పారు: “నువ్వు మమ్మల్ని పంపించిన దేశంలోకి మేము వెళ్లాం, అది నిజంగానే పాలుతేనెలు ప్రవహించే దేశం;+ ఇవి దాని పండ్లు. 28 అయితే, ఆ దేశంలో నివసించే ప్రజలు చాలా బలవంతులు; వాళ్ల నగరాలు చాలా పెద్దవి, వాటికి ప్రాకారాలు ఉన్నాయి. అంతేకాదు అక్కడ మేము అనాకీయుల్ని చూశాం.+ 29 నెగెబు దేశంలో అమాలేకీయులు+ నివసిస్తున్నారు; కొండ ప్రాంతంలో హిత్తీయులు, యెబూసీయులు,+ అమోరీయులు+ నివసిస్తున్నారు; సముద్రం దగ్గర,+ అలాగే యొర్దాను తీరం వెంబడి కనానీయులు+ నివసిస్తున్నారు.”
30 అప్పుడు కాలేబు మోషే ముందు నిలబడిన ప్రజల్ని శాంతపర్చడానికి ప్రయత్నిస్తూ, “మనం వెంటనే అక్కడికి వెళ్దాం, మనం దాన్ని తప్పక స్వాధీనం చేసుకుంటాం; ఎందుకంటే మనం దాన్ని ఖచ్చితంగా జయించగలం” అన్నాడు.+ 31 అయితే అతనితో పాటు అక్కడికి వెళ్లొచ్చిన వాళ్లు, “మనం ఆ ప్రజలతో యుద్ధం చేయలేం, వాళ్లు మనకన్నా బలవంతులు” అన్నారు.+ 32 తాము వేగుచూసి వచ్చిన దేశం గురించి వాళ్లు ఇశ్రాయేలీయులకు చెడ్డ నివేదిక ఇస్తూ ఇలా అంటూ ఉన్నారు: “మేము వేగుచూడడానికి ఏ దేశానికైతే వెళ్లామో ఆ దేశం దాని నివాసుల్ని మింగేసే దేశం; అందులో మేము చూసిన ప్రజలంతా భారీకాయులు.+ 33 అక్కడ మేము అనాకు వంశస్థులైన+ భారీకాయుల్ని* చూశాం, వాళ్లు నెఫీలీయుల నుండి వచ్చారు; వాళ్లతో పోల్చుకున్నప్పుడు మేము మా కంటికీ వాళ్ల కంటికీ మిడతల్లా* కనిపించాం.”