భాగం 5
జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?
నోవహు కాలంలో ఎక్కువమంది చెడ్డ ప్రజలే ఉండేవాళ్లు. ఆదికాండం 6:5
ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టారు, భూమ్మీద ప్రజలు ఎక్కువయ్యారు. అప్పుడు కొంతమంది దేవదూతలు దేవునికి ఎదురుతిరిగి సాతానుతో చేరారు.
వాళ్లు స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి మనుషుల్లా భూమ్మీదికి వచ్చారు. ఆ స్త్రీలకు పుట్టిన పిల్లలు మిగతావాళ్లలా కాకుండా భయంకరంగా, చాలా బలంగా ఉండేవాళ్లు.
భూమి చెడ్డ ప్రజలతో నిండిపోయింది. “భూమ్మీద మనుషుల దుష్టత్వం చాలా ఎక్కువగా ఉందని, వాళ్ల హృదయంలోని ఆలోచనలన్నీ ఎప్పుడూ చెడువైపే మొగ్గుచూపుతాయని” బైబిలు చెప్తుంది.
నోవహు దేవుడు చెప్పింది విని, ఓడ కట్టాడు. ఆదికాండం 6:13, 14, 18, 19, 22
నోవహు మంచివాడు. యెహోవా ఒక జలప్రళయం రప్పించి చెడ్డ వాళ్లందర్నీ నాశనం చేస్తానని ఆయనతో చెప్పాడు.
ఒక పెద్ద ఓడ కట్టి తన కుటుంబాన్ని, అన్నిరకాల జంతువుల్ని దానిలోకి తీసుకెళ్లమని దేవుడు నోవహుకు చెప్పాడు.
జలప్రళయం వస్తుందని నోవహు ప్రజల్ని హెచ్చరించాడు, కానీ వాళ్లు వినలేదు. కొంతమంది ఆయన్ని ఎగతాళి చేశారు, ఇంకొంతమంది అసహ్యించుకున్నారు.
ఓడ కట్టడం పూర్తయిన తర్వాత నోవహు అందులోకి జంతువుల్ని తీసుకెళ్లాడు.