మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• జ్యోతిష్కులు యేసును చూడడానికి ఎప్పుడు వెళ్ళారు?
ఒక బైబిలు ఇలా వ్యాఖ్యానిస్తోంది: ‘యేసు పుట్టినరోజు రాత్రి ఆయనను చూడడానికి పశువుల కొట్టానికి గొర్రెల కాపరులు వెళ్ళారు కానీ జ్యోతిష్కులు వెళ్లలేదు. అయితే, ఆ జ్యోతిష్కులు కొన్ని నెలల తర్వాత ఆయనను చూడడానికి వెళ్లారు.’ అప్పటికల్లా, యేసు కొన్నినెలలు గడిచిన “శిశువుగా” ఇంట్లోవున్నాడు. (మత్త. 2:7-11) యేసు పుట్టినరోజు రాత్రే ఆ జ్యోతిష్కులు ఆయనను చూసి బంగారం, ఇతర విలువైన కానుకలు ఇచ్చివుంటే, 40 దినాల తర్వాత దేవాలయానికి వెళ్ళినప్పుడు మరియ రెండు పక్షుల్ని మాత్రమే అర్పించివుండేదా?—1/1, 31వ పేజీ.
• తమ జీవితాలను మరింత అర్థవంతం చేసుకోవడానికి చాలామంది ఏమి చేయవచ్చు?
‘నేను నా పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకుని, నా జీవితాన్ని నిరాడంబరంగా మార్చుకోగలనా?’ అని ఒక వ్యక్తి తనను తాను ప్రశ్నించుకోవచ్చు. ఆమీ అలాగే చేసింది. ఆమెకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, సంతోషం మాత్రం కరువైంది. ఈ లోకంలో ఉద్యోగం చేయడంవల్ల తనకు విశ్వాసం నుండి తొలగిపోయేంత పరిస్థితి ఏర్పడిందని ఆమె గుర్తించింది. అందుకే, దేవుని రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వాలని నిర్ణయించుకొని, కొంతకాలం పయినీరుగా సేవ చేసింది. లౌకిక లక్ష్యాల కోసం ప్రయాసపడుతున్నప్పుడు “చవిచూడని సంతృప్తిని ఇప్పుడు చవిచూస్తున్నాను” అని ఆమీ చెబుతోంది.—1/15, 19వ పేజీ.
• జీవితంలో సంతృప్తిని పొందడానికి కొంతమంది తల్లులు ఏమి చేయవచ్చు?
చాలామంది తల్లులు ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు కుటుంబ ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అలా ఉద్యోగాలు చేస్తుంటే, మరికొందరు ఆర్థిక స్వావలంబన కోసం లేదా విలాసవంతమైన జీవితం కోసం ఉద్యోగం చేస్తుండవచ్చు. ఇంకా కొంతమందికి తమ ఉద్యోగమంటే ఇష్టం కాబట్టి ఉద్యోగం చేస్తుంటారు. క్రైస్తవ తల్లులు ఇంట్లో, ప్రాముఖ్యంగా పిల్లలు చిన్నగావున్నప్పుడు, ప్రధానపాత్ర పోషిస్తారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం కోసం కొంతమంది పార్ట్టైమ్ ఉద్యోగం చేయాలని లేదా ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నారు. అలా వారు ఎంతో సంతృప్తిని పొందుతున్నారు.—4/1, 18-21 పేజీలు.
• యేసు, మత్తయి 24:34లోవున్న తన మాటల్లో ఏ “తరము” గురించి ప్రస్తావించాడు?
యేసు తన కాలంలోని చెడ్డవారితో మాట్లాడుతున్నప్పుడు లేదా వారి గురించి మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా “తరము” అనే పదాన్ని ప్రతికూలభావంలో ఉపయోగించాడు. అయితే, త్వరలోనే పరిశుద్దాత్మచేత అభిషేకించబడబోయే తన శిష్యులతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఆయన అలా ఉపయోగించలేదు. మత్తయి 24:32, 33లో చెప్పబడినట్లుగా విషయాలను ఖచ్చితంగా వారు మాత్రమే అర్థంచేసుకోగలుగుతారు. కాబట్టి, యేసు మొదటి శతాబ్దపు అభిషిక్తులను, నేడు ఆయన మాటలు అన్వయించే అభిషిక్తులను ఉద్దేశించి మాట్లాడాడని మనం అర్థంచేసుకోవచ్చు.—2/15, 23-4 పేజీలు.
• యాకోబు 3:17 ప్రకారం, మనం ఏయే లక్షణాలను కనబరచాలి?
మనం పవిత్రంగా ఉంటూ, చెడు విషయాలను వెంటనే తిరస్కరించాలి. (ఆది. 39:7-9) మనం సమాధానపరులుగా కూడా ఉండాలి. అలా ఉండాలంటే మనం విపరీతమైన కోపాన్ని, ఆగ్రహాన్ని విడనాడాలి. సమాధానానికి భంగం కలిగించే పనులకు దూరంగా ఉండాలి. మనలో ప్రతి ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నేను సమాధానాన్ని వృద్ధిచేసే వ్యక్తిగా ఉన్నానా లేక సమాధానాన్ని పాడుచేసే వ్యక్తిగా ఉన్నానా? తరచు ఇతరులతో నాకు అభిప్రాయభేదాలు ఉంటున్నాయా? నేను ఊరకనే అభ్యంతరపడుతున్నానా లేక వేరేవారికి అభ్యంతరం కలిగిస్తున్నానా? లేక నేను చెప్పిందే ఇతరులు వినాలని పట్టుపట్టకుండా, ఇతరుల తప్పులను వెంటనే క్షమించడానికి సిద్ధంగావున్నానా?’—3/15, 24-5 పేజీలు.