దేవుని రాజ్యం అంటే ఏమిటి?
యేసు ప్రకటనాపని యొక్క ముఖ్యాంశమేమిటి? దేవుని రాజ్యం అని యేసే స్వయంగా చెప్పాడు. (లూకా 4:43) యేసు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆ రాజ్యం గురించి ఆయన ప్రస్తావించడాన్ని ప్రజలు అనేకసార్లు వినేవుంటారు. రాజ్యం గురించి విన్నప్పుడు వారు కలవరపడ్డారా? ఆ రాజ్యమేమిటి అని ఆయనను అడిగారా? లేదు. వారలా అడిగినట్లు బైబిల్లోని యేసు గురించిన వృత్తాంతాలేవీ చెప్పడంలేదు. మరైతే దేవుని రాజ్యం అంటే ఏమిటో వారికి తెలుసా?
యూదులు పవిత్రంగా పరిగణించే ప్రాచీన లేఖనాలు ఆ రాజ్యం గురించి వివరించడమేకాక, అది ఏమిటో, ఏమి చేస్తుందో నిశ్చితంగా, స్పష్టంగా వెల్లడిచేస్తున్నాయి. యూదుల్లాగే, నేడు మనం కూడా బైబిలునుండి ఆ రాజ్యం గురించి మరింత నేర్చుకోవచ్చు. ఆ రాజ్యం గురించి బైబిలు బోధించే ఏడు సత్యాలను మనమిప్పుడు పరిశీలిద్దాం. మొదటి మూడు, యేసు కాలంలోని యూదులకు, అంతకన్నా ముందున్నవారికి కూడా తెలిసిన సత్యాలే. తర్వాతి మూడు, క్రీస్తు ద్వారా లేదా మొదటి శతాబ్దంలోని ఆయన అపొస్తలుల ద్వారా బయలుపర్చబడ్డాయి. చివరిది మన కాలంలో స్పష్టమయ్యింది.
1. దేవుని రాజ్యం నిరంతరం నిలిచివుండే ఒక నిజమైన ప్రభుత్వం. విశ్వసనీయులైన మానవులను విడిపించేందుకు దేవుడు ఒక రక్షకుణ్ణి పంపిస్తాడని బైబిల్లోని తొలి ప్రవచనం వెల్లడిచేసింది. ఆదాము, హవ్వ, సాతానుల తిరుగుబాటుతో ప్రారంభమైన తీవ్ర సమస్యలను “సంతానం” అని పిలువబడిన ఈ రక్షకుడు, రూపుమాపుతాడు. (ఆదికాండము 3:15) విశ్వసనీయుడైన దావీదుకు చాలాకాలం తర్వాత, ఈ “సంతానం” లేదా మెస్సీయ గురించిన ఉత్తేజకరమైన విషయాలు తెలియజేయబడ్డాయి. ఆ సంతానం ఒక రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ రాజ్యం ఇతర రాజ్యాలకు ఎంతో భిన్నంగా ఉంటుంది. అది నిరంతరం నిలిచివుంటుంది.—2 సమూయేలు 7:12-14.
2. దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాలన్నింటినీ నిర్మూలిస్తుంది. ప్రవక్తయైన దానియేలు తనకివ్వబడిన దర్శనంలో, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా మన కాలం వరకు కొనసాగే వివిధ ప్రపంచ ప్రభుత్వాలను చూశాడు. ఆ దర్శనం యొక్క ఉత్కంఠభరితమైన ముగింపును గమనించండి: “ఆ [చివరి మానవ] రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” కాబట్టి ఈ ప్రపంచంలోని రాజ్యాలు లేదా ప్రభుత్వాలన్నింటితోపాటు వాటి యుద్ధాలు, అణచివేత, దుష్టత్వం వంటివన్నీ శాశ్వతంగా నిర్మూలించబడతాయి. దానియేలు ప్రవచనం తెలియజేస్తున్నట్లుగా, దేవుని రాజ్యం త్వరలోనే భూమిని పరిపాలిస్తుంది. (దానియేలు 2:44, 45) ఆ ప్రభుత్వం వాస్తవమైనది, భూమ్మీద అది మాత్రమే ఉనికిలో ఉంటుందనేది ముమ్మాటికీ నిజం.a
3. దేవుని రాజ్యం యుద్ధాలను, అనారోగ్యాన్ని, కరవును, మరణాన్ని కూడా రూపుమాపుతుంది. ఈ భూమిపై దేవుని రాజ్యం ఏమి చేయబోతోందనే విషయాన్ని ఉత్తేజకరమైన బైబిలు ప్రవచనాలు వెల్లడిచేస్తున్నాయి. మానవ సంస్థలు ముందెప్పుడూ చేయని, భవిష్యత్తులో చేయలేని దానిని ఆ ప్రభుత్వం చేస్తుంది. యుద్ధాయుధాలన్నీ సమూలంగా నాశనం చేయబడడాన్ని ఊహించుకోండి! “ఆయనే [దేవుడే] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.” (కీర్తన 46:9) వైద్యుల అవసరం గానీ, ఆస్పత్రుల అవసరం గానీ ఇక ఉండదు, ఎందుకంటే ఇక ఎలాంటి వ్యాధులు ఉండవు. ‘నాకు దేహములో బాగోలేదని నివాసులెవరు అనరు.’ (యెషయా 33:24) కరువులు, ఆహార కొరత, కుపోషణ, ఆకలితో అలమటించడం వంటివి ఇక ఉండవు. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:16) అంత్యక్రియలు, శవదహనాలు, శ్మశానాలు, మార్చురీలు ఉండవు లేదా వాటి కారణంగా కలిగే దుఃఖం ఇక ఉండదు. చివరకు, క్రూరశత్రువైన మరణం తీసివేయబడుతుంది. “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”—యెషయా 25:8.
4. దేవుని రాజ్యాన్ని దేవుడు నియమించిన రాజు పరిపాలిస్తాడు. మెస్సీయ తనను తాను నియమించుకోలేదు లేదా అపరిపూర్ణ మానవులు ఆయనను ఎన్నుకోలేదు. యెహోవా దేవుడే ఆయనను ఎంపికచేశాడు. అలా అని మెస్సీయ, క్రీస్తు అనే విశిష్ఠ పేర్లే రుజువుచేస్తున్నాయి. ఆ రెండు పదాలకు “అభిషిక్తుడు” అని అర్థం. కాబట్టి ఈ రాజు యెహోవా చేత అభిషేకించబడినవాడు లేదా ఒక ప్రత్యేక పనికోసం ఎంపిక చేయబడినవాడు. ఆయన గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: “ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.” (యెషయా 42:1; మత్తయి 12:17, 18) మనకు ఎలాంటి పరిపాలకుడు అవసరమో మన సృష్టికర్తకన్నా ఎక్కువగా ఇంకెవరికి తెలుసు?
5. దేవుని రాజ్య పరిపాలకుడు, మానవులందరి ముందు తన అర్హతను నిరూపించుకున్నాడు. నజరేయుడైన యేసే ప్రవచింపబడిన మెస్సీయ అని రుజువయ్యింది. ఆయన దేవుడు ఎంచుకున్న వంశంలో పుట్టాడు. (ఆదికాండము 22:18; 1 దినవృత్తాంతములు 17:11; మత్తయి 1:1) మెస్సీయ గురించి శతాబ్దాల క్రితం నమోదు చేయబడిన ఎన్నో ప్రవచనాలను ఆయన భూమ్మీద ఉన్నప్పుడు నెరవేర్చాడు. ఆయనే మెస్సీయ అని పరలోకం నుండి కూడా ఆమోదం లభించింది. ఎలా? దేవుడు పరలోకం నుండి యేసే తన ప్రియ కుమారుడని చెప్పాడు; దేవదూతలు ఈయనే ప్రవచించబడిన మెస్సీయ అని చెప్పారు; దేవుని శక్తితో యేసు వందలమంది, కొన్నిసార్లు వేలమంది కళ్లారా చూస్తుండగా తరచూ అద్భుతాలు చేశాడు.b తాను ఎలాంటి పరిపాలకునిగా ఉంటాడో యేసు పదేపదే చూపించాడు. ప్రజలకు సహాయం చేసే శక్తి ఆయనకు ఉండడమే కాక, అలా చేయాలని కూడా ఆయన కోరుకునేవాడు. (మత్తయి 8:1-3) ఆయన నిస్వార్థపరుడు, కరుణగలవాడు, ధైర్యవంతుడు, వినయంగలవాడు. భూమిపై ఆయన జీవితం గురించిన నివేదిక అందరూ చదివేలా బైబిల్లో వ్రాయబడింది.
6. దేవుని రాజ్యంలో క్రీస్తుతోపాటు1,44,000 మంది సహరాజులు ఉంటారు. అపొస్తలులేకాక ఇంకా ఇతరులు కూడా పరలోకంలో తనతోపాటు పరిపాలిస్తారని యేసు చెప్పాడు. వారిని ఆయన “చిన్న మందా” అని పిలిచాడు. (లూకా 12:32) ఈ చిన్న మంద సంఖ్య 1,44,000 అని ఆ తర్వాత అపొస్తలుడైన యోహానుకు వెల్లడిచేయబడింది. వారు పరలోకంలో క్రీస్తుతోపాటు రాజులుగా పరిపాలించే, యాజకులుగా సేవ చేసే ఆసక్తికరమైన నియామకాన్ని పొందుతారు.—ప్రకటన 5:9, 10; 14:1, 3.
7. దేవుని రాజ్యం ఇప్పుడు పరలోకంలో పరిపాలిస్తోంది అలాగే, భూమంతటిపై పరిపాలనను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడవ సత్యం, మనం నేర్చుకోగల ఉత్తేజకరమైన సత్యాల్లో ఒకటి. యేసుకు ఇప్పటికే పరలోకంలో రాజ్యాధికారం ఇవ్వబడింది అనేందుకు బైబిల్లో ఎన్నో రుజువులున్నాయి. ప్రస్తుతం ఆయన పరలోకంలో పరిపాలిస్తున్నాడు. మన కాలంలోనే అంటే అతి త్వరలోనే భూమిపై తన పరిపాలనను ప్రారంభించి, మనమిప్పటికే పరిశీలించిన మహత్తరమైన ప్రవచనాలను నెరవేరుస్తాడు. అయితే దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందని మనమెలా నమ్మగలం? అది భూమిపై పరిపాలన ఎప్పుడు ప్రారంభిస్తుంది? (w08 1/1)
[అధస్సూచీలు]
a చాలామందికి బోధించబడుతున్నట్లుగా దేవుని రాజ్యం మన హృదయాల్లో ఉండదని ఈ ప్రవచనం వంటి ఇతర ప్రవచనాలు చూపిస్తున్నాయి. 13వ పేజీలో ఉన్న “మా పాఠకుల ప్రశ్న” అనే ఆర్టికల్ చూడండి.
b ఉదాహరణకు, మత్తయి 3:17; లూకా 2:10-14; యోహాను 6:5-14 చూడండి.