వృద్ధుడైనా చురుకుగా ఉన్నాడు
వృద్ధాప్యం కారణంగా చాలామంది దుర్బలులై, సమాజంలోని ఇతరులకు దూరమౌతారు. కానీ, జెనీవాలోని స్విట్జర్లాండ్లో తన 95వ ఏట మరణించిన ఫెర్నాన్ రివారోల్ విషయంలో అలా జరగలేదు. ఆయన ఒంటరిగా జీవించేవాడు, ఎందుకంటే ఆయన భార్య మరణించింది, వివాహమైన తన కుమార్తె వేరే ఇంట్లో ఉండేది. ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమైనా లేక ఇంట్లోనే నిర్బంధించబడినట్లు ఉన్నా, ఒంటరితనాన్ని మాత్రం దూరంగా ఉంచాడు. ఆయన తరచూ ముందు గదిలో కూర్చొని, ఫోన్చేసి ప్రజలతో ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూవుండేవాడు.
ఆసక్తికరంగా సాగిన ఆయన జీవితంలో, ఫెర్నాన్ ఒకప్పుడు నిజంగానే నిర్బంధించబడ్డాడు. ఎందుకు? ఫెర్నాన్, ఆయన భార్య 1939లో యెహోవాసాక్షులు అయ్యారు, ఆ సమయంలో యూరప్లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. ఎవరికీ హానిచేయకూడదనే బైబిలు ఆధారిత నిర్ణయానికి ఫెర్నాన్ కట్టుబడ్డాడు. ఆ కారణంగా ఆయన తన ఉద్యోగం కోల్పోవడమే కాక, మొత్తం ఐదున్నర సంవత్సరాల కాలంలో చాలాసార్లు జైలుశిక్షలు అనుభవించాడు, ఆ కాలమంతటిలో ఆయన తన భార్యకు, తన కూతురికి దూరమయ్యాడు.
గతాన్ని గుర్తుతెచ్చుకుంటూ ఫెర్నాన్ ఇలా చెప్పాడు: “నేను మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి, నా కుటుంబానికి ఎలాంటి ఆసరా లేకుండా చేశానని చాలామందికి అనిపించింది. ప్రజలు నన్ను తృణీకరిస్తూ, నేరస్థునిలా పరిగణించేవారు. ఆ క్లిష్ట సంవత్సరాల గురించి నేను ఆలోచించినప్పుడు, యెహోవా ఎలా మాకు మద్దతునిచ్చి, సహాయం చేశాడనేదే నాకు గుర్తొస్తుంది. అప్పటినుండి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ యెహోవాపట్ల నా విశ్వాసం అప్పుడెంత దృఢంగా ఉండేదో ఇప్పుడూ అంతే దృఢంగా ఉంది.”
ఆ విశ్వాసమే, తన లేఖనాధారిత నిరీక్షణను ఫోన్ ద్వారా ఇతరులతో పంచుకునేందుకు ఫెర్నాన్ను పురికొల్పింది. ఎవరైనా అనుకూలంగా ప్రతిస్పందిస్తే ఆయన ఆ వ్యక్తికి పోస్టు ద్వారా బైబిలు సాహిత్యాలు పంపించేవాడు. ఆ తర్వాత, ఆ వ్యక్తి సాహిత్యాన్ని చదివి ఆనందించారేమో కనుక్కోవడానికి ఆయన వారికి ఫోన్ చేసేవాడు. కొన్నిసార్లు ప్రజలు ప్రశంసాపూర్వకంగా ఉత్తరాలు వ్రాసేవారు, అది ఆయనకెంతో సంతోషాన్నిచ్చేది.
మీ ప్రాంతంలో ఫెర్నాన్లాంటి ఎవరైనా మిమ్మల్నికూడా సంప్రదించవచ్చు. ఆయన ఏమి నమ్ముతున్నాడో తెలుసుకోవడానికి ఆయన ఏమి చెబుతాడో మీరు ఎందుకు వినకూడదు? యెహోవాసాక్షులు తమ నమ్మకాలను మీతో పంచుకోవడానికి ఎల్లప్పుడూ సంతోషిస్తారు.