పాఠకుల ప్రశ్నలు
ప్రభువు రాత్రి భోజన జ్ఞాపకార్థ ఆచరణను సంఘం జరుపుకుంటున్నప్పుడు ఒక అభిషిక్త క్రైస్తవుడు అనారోగ్య కారణంగా హాజరుకాలేని పరిస్థితిలో ఉంటే ఏమైనా ఏర్పాట్లు చేయవచ్చా?
చేయవచ్చు. సంఘం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకుంటున్నప్పుడు ఒక అభిషిక్త క్రైస్తవుడు హాజరుకాలేనంతటి అనారోగ్యంతో ఉన్నా లేక పడకమీది నుండి లేవలేని స్థితిలో ఉన్నా ఆయన పరిస్థితి దృష్ట్యా ఆయన కోసం ఏమైనా ఏర్పాట్లు చేయవచ్చు, అలా చెయ్యాలి. అలాంటి సందర్భంలో పెద్దల సభ ఒక పెద్ద చేత గానీ లేక అనుభవజ్ఞుడైన ఒక క్రైస్తవుని చేత గానీ చిహ్నాలైన రొట్టెను, ద్రాక్షారసమును అదే రాత్రి, సూర్యోదయానికి ముందు ఆ తోటి క్రైస్తవుని వద్దకు పంపించే ఏర్పాటు చేయాలి.
అక్కడికి వెళ్ళిన పెద్ద లేక వేరే సహోదరుడు అక్కడున్న పరిస్థితులను బట్టి క్లుప్త వ్యాఖ్యానాలను చేసి సముచితమైన లేఖనాలను చదవవచ్చు. ప్రభువు రాత్రి భోజనాన్ని ఆరంభించినప్పుడు యేసు స్థిరపరచిన మాదిరిని ఆయన అనుసరించవచ్చు. ఉదాహరణకు మత్తయి 26:26 చదివి ప్రార్థన చేసిన తర్వాత పులియని రొట్టెను అందించవచ్చు. ఆ తర్వాత మత్తయి 26వ అధ్యాయంలోని 27, 28 వచనాలను చదివి మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత ద్రాక్షారసమును అందించవచ్చు. ఒక్కొక్క చిహ్నాన్ని అందించడానికి ముందు క్లుప్త వ్యాఖ్యానాలు చేయవచ్చు, ముగింపు ప్రార్థన చేయడం మంచిది.
కానీ సంఘంలో జరిగే ప్రభువు రాత్రి భోజనపు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరుకావడానికి సహేతుకమైన ప్రతి ప్రయత్నం తప్పకుండా చేయాలి. అయితే ఒక అభిషిక్త క్రైస్తవుడు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నా లేక నీసాను 14 సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థాన్ని ఆచరించడానికి అనుమతించనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఏమి చేయవచ్చు? అలాంటప్పుడు ఆ అభిషిక్తుడు మోషే ధర్మశాస్త్రంలోని ఏర్పాటును అనుసరిస్తూ 30 రోజుల తర్వాత విడిగా జ్ఞాపకార్థాన్ని ఆచరించవచ్చు.—సంఖ్యాకాండము 9:9-14.