“ఉప్పు నిస్సారమైతే”
దాని కోసం యుద్ధాలు జరిగాయి. అది మారక ద్రవ్యంగా ఉపయోగించబడింది. ప్రాచీన చైనాలో, విలువ విషయంలో దానికి బంగారం తర్వాత రెండవ స్థానం ఉంది. అవును, ఉప్పును మానవజాతి ఎప్పటినుండో ఎంతో ఖరీదైన పదార్థంగా ఎంచుతోంది. ఈనాటికీ, దానికి ఔషధగుణాలున్నట్లు పరిగణించబడుతోంది, అది భూవ్యాప్తంగా రుచిని పెంచేదిగానూ, నిలువచేసేదిగానూ ఉపయోగించబడుతోంది.
ఉప్పుకున్న అనేక ప్రత్యేక లక్షణాలను బట్టీ, దాని ఉపయోగాలను బట్టీ, ఉప్పు బైబిల్లో సూచనార్థకంగా ఉపయోగించబడిందంటే అందులో ఆశ్చర్యం లేదు. ఉదాహరణకు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం యెహోవాకు బలిపీఠం మీద అర్పించబడేదేదైనా దానికి ఉప్పు చేర్చబడాలి. (లేవీయకాండము 2:13) ఉప్పును చేర్చడం బలుల రుచిని పెంచడానికి కాదుగాని బహుశ కాలుష్యం నుండి లేక కుళ్లు నుండి విముక్తికి ఉప్పు ప్రాతినిధ్యం వహిస్తుంది గనుక అయ్యుండవచ్చు.
ప్రసిద్ధి గాంచిన తన కొండ మీది ప్రసంగంలో యేసుక్రీస్తు తన అనుచరులకిలా చెప్పాడు: “మీరు లోకమునకు ఉప్పయ యున్నారు.” (మత్తయి 5:13) వాళ్లు దేవుని రాజ్యం గురించి ఇతరులకు ప్రకటించడం అన్నది వినేవారిపై నిలువచేసే లేక జీవాన్ని కాపాడే ప్రభావాన్ని కలిగిస్తుందని యేసు ఈ వ్యాఖ్యానం ద్వారా సూచించాడు. వాస్తవానికి, యేసు మాటలను అనుసరించేవారు తాము నివసించిన, సేవచేసిన సమాజాల నైతిక, ఆధ్యాత్మిక కుళ్లు నుండి కాపాడబడేవారు.—1 పేతురు 4:1-3.
అయితే, యేసు తర్వాత ఈ హెచ్చరికనిచ్చాడు: “ఉప్పు నిస్సారమైతే . . . అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.” దీనిపై వ్యాఖ్యానిస్తూ, యేసుకు ఆయన అపొస్తలులకు తెలిసిన ఉప్పు “కల్తీ అయినది, ఆకులు, మొక్కలు కలగలిసినది, మట్టితో నిండినది” అని బైబిలు పండితుడైన అల్బర్ట్ బాన్స్ చెప్తున్నాడు. కాబట్టి ఉప్పు తన రుచిని కోల్పోతే, “చెప్పుకోదగినంత మోతాదులో మట్టి” మాత్రం మిగులుతుంది. “అది, దారులలోనూ, లేక మనుష్యులు నడిచే మార్గాల్లోనూ కంకరలా పడేయడానికి తప్ప . . . దేనికీ పనికిరాదు” అని ఆయన చెబుతున్నాడు.
క్రైస్తవులు ఈ హెచ్చరికను విని, బహిరంగంగా సాక్ష్యమివ్వడాన్ని మానుకోకుండా లేక దేవుని కిష్టంలేని ప్రవర్తనలో పడిపోకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే వాళ్లు ఆధ్యాత్మికంగా క్షీణించిపోయి, ‘తన సారాన్ని కోల్పోయిన ఉప్పులా’ నిష్ప్రయోజనంగా మారిపోతారు.