“శిశుప్రాయము నుండి నీవెరుగుదువు”
పిల్లలతో వారి శిశుప్రాయం నుండే మాట్లాడటమన్నది వారి ఆలోచనా, తార్కిక, సమస్యా పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తూ వారి మేధస్సు అభివృద్ధిపై విస్తృత ప్రభావాన్ని చూపిస్తుందని ఇటీవలి విజ్ఞానశాస్త్ర అధ్యయనాలు చూపిస్తున్నాయి. ప్రత్యేకించి పిల్లల తొలి సంవత్సరకాలంలో ఇది వాస్తవం. “తరువాతి కాలంలో వారి తెలివితేటలూ, వారి స్కూల్ విజయమూ, ఇతర రంగాల్లో వారి ప్రతిభా ముఖ్యంగా శిశువు ప్రతిదినం ఎన్ని ఎక్కువ మాటలు వింటాడన్న దానిమీదే ఆధారపడి ఉంటాయి.” అని కొంతమంది పరిశీలకులు ఇప్పుడు నమ్ముతున్నారని ది ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నివేదిస్తుంది.
అయితే, మాట్లాడే మాటలు తప్పనిసరిగా ఒక వ్యక్తి నుండి రావాల్సిందే. టి.వి గానీ, రేడియో గానీ అందుకు ప్రత్యామ్నాయం కాదనిపిస్తుంది.
అమెరికాలోని, సేటిల్ నందలి యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఒక న్యూరోసైంటిస్ట్ ఈ విధంగా అంది: “నరాల కనెక్షన్లను జీవిత తొలిదశలోనే ఏర్పడతాయని మనకిప్పుడు తెలుసు, శిశువు మెదడు ఈ కనెక్షన్లు ఎలా చేయాలో నిర్ణయించడానికి అనుభవాల కొరకు అక్షరార్థంగానే వేచివుంటుంది. ఎంత ముందుగా ఈ ప్రక్రియ మొదలవుతుందో ఇటీవలి వరకూ మనం గ్రహించలేదు. ఉదాహరణకు, శిశువులు తమ మాతృభాషకు సంబంధించిన శబ్దాలను వారి ఆరునెలల వయసు లోపే నేర్చుకుంటారు.”
పిల్లలకు బాగా ప్రేమను అందిస్తే చాలు, అదే వారిని తెలివితేటలతో వర్థిల్లేలా చేస్తుంది అన్న సర్వవ్యాప్త అభిప్రాయాన్ని ఇటీవలి పరిశోధనలు సవాలు చేస్తున్నాయి. పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రను కూడా అది ఉన్నతపరుస్తుంది.
ఇది అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన ప్రేరేపిత లేఖలోని ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తుంది: “రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యము (“శిశుప్రాయము”, NW) నుండి నీ వెరుగుదువు.” తిమోతితో విశ్వాసులైన అతని తల్లి, అవ్వ శిశుప్రాయం నుండే పరిశుద్ధ లేఖనాలను చెప్పడం అతడు దేవుని విశిష్టమైన సేవకుడిగా ఎదగడంలో ఒక కీలకమైన పాత్రను వహించింది. (ఇటాలిక్కులు మావి.)—2 తిమోతి 1:5; 3:15.