బైబిలు అనుపమానమైన గ్రంథం
అది ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకమని పిలువబడింది, మరి అది అలా పిలువబడటం సముచితమే. ఇతర ఏ పుస్తకంకన్నా ఎక్కువగా బైబిలును చదవడం మరియు ఇష్టపడటం జరిగింది. నేటికి, (మొత్తంగా లేక కొంత భాగంగా) 2,000 భాషల్లో బైబిలు యొక్క నాలుగు వందల కోట్ల ప్రతులు పంపిణీ చేయబడ్డాయని అంచనా వేయబడింది.
అయితే, బైబిలు యొక్క పంపిణీకన్నా మరింత ఆసక్తికరమైన విషయం, అది దైవికంగా ప్రేరేపించబడిందనే వాస్తవం. ‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినదని’ క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 తిమోతి 3:16) దాని భావమేమిటి? “దైవావేశము వలన కలిగిన” (గ్రీకు, థియోన్యూస్టోస్) అనే పదబంధం అక్షరార్థంగా “దేవుడు ఊదాడు” అనే భావాన్ని కలిగివుంది. దానికి సంబంధించిన గ్రీకు పదమైన న్యూమా అంటే “ఆత్మ” అని భావం. కాబట్టి, సూచనార్థకంగా చెప్పాలంటే దేవుని పరిశుద్ధాత్మ మానవ రచయితలపై ఊదినట్లు వారిని ప్రేరేపించినందున, తుది ఫలితాన్ని మానవుని వాక్యమని కాదుగానీ వాస్తవంగా దేవుని వాక్యమనే పిలువవచ్చు. వాస్తవానికి, బైబిలును అధ్యయనం చేసిన అనేకులు దాని సంపూర్ణ సామరస్యత, దాని వైజ్ఞానిక కచ్చితత్వం, దాని రచయితల యథార్థతా నిజాయితీలు మరియు అత్యంత ప్రాముఖ్యంగా దానిలో నెరవేరిన ప్రవచనాలనుబట్టి ఆశ్చర్యచకితులౌతున్నారు, ఈ పుస్తకం మానవుని కంటే ఉన్నతమైన మూలంనుండి వచ్చిందని కోట్లాదిమంది ఆలోచనాపరులైన పాఠకులను ఇవన్నీ ఒప్పించాయి.a
అయితే బైబిలు వ్రాయబడటానికి దేవుడు ఎంత నిశితంగా నడిపింపునిచ్చాడు? ఆయన బైబిలులోని ప్రతి పదాన్ని చెప్పిరాయించాడని కొందరంటారు. ఆయన బైబిలులో కనుగొనబడే తలంపులనే ప్రేరేపించాడు కానీ ప్రతి పదాన్నీ కాదని ఇతరులంటారు. అయితే, వాస్తవానికి ప్రేరేపణ ఒకే క్రియ అని మనం దానికి హద్దులు వేయలేము, ఎందుకంటే దేవుడు “నానా విధములుగా . . . ప్రవక్తలద్వారా మన పితరులతో” మాట్లాడాడు. (ఇటాలిక్కులు మావి.) (హెబ్రీయులు 1:1; 1 కొరింథీయులు 12:6 పోల్చండి.) తదుపరి శీర్షికలో, బైబిలును రచించిన కనీసం 40 మంది మానవ రచయితలతో దేవుడు మాట్లాడిన విధానాలను మనం పరిశీలిస్తాము.
[అధస్సూచీలు]
a అదనపు సమాచారం కొరకు, వాచ్టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? అనే (ఆంగ్లం) పుస్తకం యొక్క 53-4 మరియు 98-161 పేజీలను చూడండి.