ప్రకృతి వైపరీత్యాలు—ఈ కాలానికి సూచనలా?
“జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.” ఈ మాటలతో యేసుక్రీస్తు 19 శతాబ్దాల క్రితమే తన శిష్యులకు, విపత్కర సంఘటనలతో పాటు అక్రమం విస్తరించడం, ప్రపంచవ్యాప్తంగా దేవుని రాజ్య సువార్త ప్రకటించబడడం “యుగసమాప్తికి” సంయుక్త సూచనగా ప్రారంభమౌతాయని వివరించాడు.—మత్తయి 24:3-14.
దీని దృష్ట్యా, మనం యిలా ప్రశ్నించాలి, గతించిన తరాలకంటే కూడా యిప్పుడు మనం వినాశకర భూకంపాలనూ ప్రచండమైన తుపాను, వరదలు, అనావృష్టి, కరువులను అధికంగా చూస్తున్నామా? విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలలో పురోభివృద్ధి సాధించినప్పటికి, ప్రకృతి వైపరీత్యాల మూలంగా మునుపటికంటే ఈనాడు ఎక్కువ మంది ప్రజలు బాధననుభవిస్తున్నారా?
అనేకులు అవునని సమాధానం యిస్తారు. ఉదాహరణకు, న్యూ సైన్టిస్ట్ పత్రిక యిలా హెచ్చరిస్తోంది: “గత దశాబ్దాలకంటే కూడా 1990 దశాబ్దంలో ప్రపంచం ఎక్కువ విపత్తులను ఎదురుచూడవచ్చు.” అదే విధంగా, ప్రపంచ వాతావరణ శాస్త్ర సంస్థ డైరెక్టరు, జూన్ 1991, యుఎన్ క్రానికల్ పత్రికలో యిలా పేర్కొన్నాడు: “ఆ పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఆ 1960 నుండి 1980 దశాబ్దం వరకూ . . . , అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాల సంభవాలు ఐదు రెట్లు పెరిగాయి, అంతేగాక ఆర్థిక నష్టాలు మూడు రెట్లు పెరిగాయి.” ఈ అంశంపై కొద్దిపాటి అవలోకనాన్ని అందిస్తూ యుఎన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పత్రికైన వరల్డ్ హెల్త్ యిలా అన్నది: “ప్రకృతి వైపరీత్యాలు వాటి విపత్కర ఫలితాలు చరిత్రంతటిలో కనబడతాయి. అయితే, 21వ శతాబ్దం సమీపిస్తున్న కొలదీ, మనం ప్రజావర్గాంక, పరిసరాల, సాంకేతికతల పరిస్థితులతో మిళితమైనవాటిని మనం ఎదుర్కొంటాం. ఇవి అనేక దేశ జనులను ప్రకృతి లేక మానవుడు తెచ్చే వినాశనాల ప్రభావాలకు మరింత భేద్యమయ్యేట్లు చేస్తాయి.”
ప్రస్తుత సంఘటనలపై శ్రద్ధ నిల్పేవారెవరికైనా అలాంటి కథనం ఆశ్చర్యంగొల్పదు. వార్తా మాధ్యమాలకు సంచలనాత్మక కథల కొరత లేదు, అది ఫిలిపైన్స్లో అగ్ని పర్వతం ప్రేలడం, లేక కాలిఫోర్నియాలో భూకంపం సంభవించడం, బంగ్లాదేశ్లో వరదలు, సొమాలియాలో కరువు, హవాయి తుపాను, లేక నికరాగ్వాలో ఆటుపోటు అలలే కావచ్చు. ప్రపంచం నందు ఏదో ఒక భాగంలో విపత్తు సంభవించిందన్న నివేదిక లేకుండా ఒక్క నెల కూడ గడవదు.
కొందరు దీనిని అంత ప్రాముఖ్యం కాదని తీసివేస్తారు. ఈ విపత్తులను చక్కగా నివేదించడం వల్ల లేక చక్కగా నివేదికలను భద్రపర్చడం వల్లనే ఈ విపత్తులు ఎక్కువైనట్లు స్పష్టమౌతోందని వారు వాదిస్తారు. అంతేకాకుండా ఈనాడు ప్రజలు అనేకమంది ఉన్నందుకే విపత్తుల మూలంగా కల్గే బాధలను అనేకమంది అనుభవిస్తున్నారని వారు వాదిస్తారు. ఈ వాదనలు సరియేనా?
పైన పేర్కొన న్యూ సైన్టిస్ట్ శీర్షికలో ఏమి చూపబడిందో గమనించండి. “ఆ నాడు 1960 దశకంలో 523, 1970 దశకంలో 767 విపత్తులు నమోదయ్యాయి. ఆ సంఖ్య 1980 దశకానికెల్లా 1387కు చేరింది.” అది యింకా వివరిస్తూ, “గత దశాబ్దం నందు పెరుగుదలకు కారణం చైనా, సోవియట్ యూనియన్ విపత్తులను దాచకుండా నివేదించడమే” అని చెప్పింది. తర్వాత అది యిలా అంటోంది: “అయినప్పటికీ, విపత్తుల సంఖ్య పెరుగుతోంది.” ఇలా చక్కగా నివేదించడంవల్ల లేక నివేదికలను జాగ్రత్తగా భద్రపర్చడం వల్లనే విపత్తుల సంఖ్య అతివేగంగా పెరిగిపోతోందని వివరించడానికి వీల్లేదు.
అంతేకాకుండా, మార్చి 1992, యుఎన్ క్రానికల్ యిలా నివేదిస్తోంది: “గత రెండు దశాబ్దాల్లో, దాదాపు 30 లక్షలమంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు, 80 కోట్లమంది ‘ప్రకృతి వైపరీత్యాలు కలిగించిన విధ్వంసం, కష్టాలు, బాధల వల్ల’ ప్రభావితమయ్యారు.” దీని భావం, భూమిపై జీవించే ప్రతి ఏడుగురు వ్యక్తుల్లో ఒకరు ఏదోక రకమైన విపత్తు లేక విషాదకర సంఘటనవల్ల ప్రభావితం చెందిన వారే. మన యుగం గొప్ప మార్పుకూ అవిశ్రాంతికి చిహ్నమనడానికి ఏ అనుమానం లేదు, మరి అది నిజంగా మనల్ని అధైర్యపర్చేదే.
అలాంటి గొప్ప విపత్తులను గూర్చి బైబిలు ముందే చెబుతోంది గనుక, వైపరీత్యాలకూ తద్వారా కలిగే బాధలకూ దేవుడే బాధ్యుడని దాని అర్థమా? అనేకమంది ప్రజలు అలాగే భావిస్తుంటారు. అయితే వాస్తవాలు ఏమి చూపిస్తున్నాయి? అన్నిటికంటే ప్రాముఖ్యంగా, బైబిలు ఏమి చూపిస్తోంది?
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Middle photo: Mark Peters/Sipa Press
WHO/League of Red Cross