లెసన్ 80
యేసు పన్నెండు మంది అపొస్తలులు
యేసు ఒకటిన్నర సంవత్సరం ప్రకటించాక ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తనతో దగ్గరగా పని చేసేవాళ్లు ఎవరు? క్రైస్తవ సంఘాన్ని నడిపించడానికి ఆయన ఎవరికి శిక్షణ ఇస్తాడు? ఈ నిర్ణయాలు తీసుకోవడానికి యేసు యెహోవా సలహా కావాలనుకున్నాడు. అందుకే ఒంటరిగా ఉండడానికి ఆయన ఒక కొండకు వెళ్లి అక్కడ రాత్రంతా ప్రార్థన చేశాడు. ఉదయం ఆయన కొంతమంది శిష్యుల్ని పిలిచి, 12 మంది అపొస్తలుల్ని ఎంచుకున్నాడు. వాళ్ల పేర్లు మీకు గుర్తున్నాయా? వాళ్లు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, మత్తయి, అల్ఫయి కొడుకైన యాకోబు, తద్దయి, సీమోను, యూదా ఇస్కరియోతు.
అంద్రెయ, పేతురు, ఫిలిప్పు, యాకోబు
యేసు ఎక్కడికి వెళ్లినా ఆ పన్నెండు మంది ఆయనతో వెళ్లేవాళ్లు. వాళ్లకు శిక్షణ ఇచ్చాక, సొంతగా ప్రకటించడానికి యేసు వాళ్లను పంపించాడు. చెడ్డదూతల్ని వెళ్లగొట్టడానికి, రోగులను బాగు చేయడానికి యెహోవా వాళ్లకు శక్తి ఇచ్చాడు.
యోహాను, మత్తయి, బర్తొలొమయి, తోమా
యేసు ఆ పన్నెండు మందిని స్నేహితులు అని పిలిచాడు, వాళ్లను నమ్మాడు. అపొస్తలులు చదువులేనివాళ్లని, సాధారణ ప్రజలని పరిసయ్యులు అనుకున్నారు. కానీ యేసు వాళ్ల పనికి అవసరమైన శిక్షణ ఇచ్చాడు. యేసు జీవితంలో ముఖ్యమైన క్షణాల్లో వాళ్లు ఆయనతో ఉంటారు. అంటే ఆయన చనిపోయే ముందు, ఆయన పునరుత్థానం తర్వాత సమయంలో వాళ్లు ఆయనతో ఉంటారు. ఆ పన్నెండు మందిలో ఎక్కువమంది యేసులా గలిలయ ప్రాంతంవాళ్లు. వాళ్లలో కొంతమందికి పెళ్లైంది.
అల్ఫయి కొడుకైన యాకోబు, యూదా ఇస్కరియోతు, తద్దయి, సీమోను
అపొస్తలులు తప్పులు చేసే అపరిపూర్ణ మనుషులు. వాళ్లు కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడారు, తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. కొన్నిసార్లు సహనం చూపించలేదు. వాళ్లలో ఎవరు గొప్ప అని కూడా వాదించుకున్నారు. అయినా వాళ్లు యెహోవాను ప్రేమించిన మంచివాళ్లు. యేసు వెళ్లిపోయాక వాళ్లు క్రైస్తవ సంఘానికి పునాది అవుతారు.
“నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను, ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటన్నిటినీ నేను మీకు తెలియజేశాను.”—యోహాను 15:15