లెసన్ 37
యెహోవా సమూయేలుతో మాట్లాడతాడు
ప్రధాన యాజకుడైన ఏలీకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్లు గుడారంలో యాజకులుగా సేవ చేసేవాళ్లు. వాళ్ల పేర్లు హొఫ్నీ, ఫీనెహాసు. వాళ్లు యెహోవా నియమాలకు లోబడలేదు, ప్రజలతో చాలా చెడ్డగా ప్రవర్తించేవాళ్లు. ఇశ్రాయేలీయులు యెహోవాకు బలులు తీసుకొచ్చినప్పుడు హొఫ్నీ, ఫీనెహాసు మాంసంలో మంచి ముక్కల్ని వాళ్లకోసం తీసుకునేవాళ్లు. తన కొడుకులు ఏమి చేస్తున్నారో ఏలీ విన్నాడు, కానీ ఆయన ఏమీ చేయలేదు. మరి యెహోవా అలా జరుగుతుంటే ఊరుకుంటాడా?
సమూయేలు హొఫ్నీ, ఫీనెహాసు కన్నా చాలా చిన్నవాడైనా, వాళ్లలా ఉండడానికి ప్రయత్నించలేదు. యెహోవా సమూయేలును చూసి చాలా సంతోషించాడు. ఒక రోజు రాత్రి నిద్రపోతున్నప్పుడు సమూయేలును ఎవరో పిలిచారు. అతను లేచి, ఏలీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఇలా అన్నాడు: ‘ఇదిగో వచ్చాను!’ కానీ ఏలీ ‘నేను నిన్ను పిలవలేదు. వెళ్లి పడుకో’ అన్నాడు. సమూయేలు వెళ్లి పడుకున్నాడు. మళ్లీ అలానే జరిగింది. మూడవసారి సమూయేలుకు ఆ గొంతు వినబడినప్పుడు సమూయేలును యెహోవా పిలుస్తున్నాడని ఏలీకి అర్థమైంది. ఆయన ఇంకొకసారి ఆ గొంతు వినబడితే సమూయేలును ఇలా అనమన్నాడు: ‘చెప్పు యెహోవా. నీ సేవకుడు వింటున్నాడు.’
సమూయేలు వెళ్లి పడుకున్నాడు. అప్పుడు అతనిని ‘సమూయేలు! సమూయేలు!’ అని ఎవరో పిలిచారు. అతను ‘చెప్పండి, మీ సేవకుడు వింటున్నాడు’ అని అన్నాడు. యెహోవా సమూయేలుతో, ‘నేను అతన్ని అతని కుటుంబాన్ని శిక్షించబోతున్నానని ఏలీకి చెప్పు. అతని కొడుకులు నా గుడారంలో చెడ్డ పనులు చేస్తున్నారని ఏలీకి తెలుసు, అయినా అతను దాని గురించి ఏమీ చేయలేదు’ అని అన్నాడు. తర్వాత ఉదయం సమూయేలు ఎప్పటిలానే గుడారం తలుపులు తెరిచాడు. యెహోవా చెప్పిన మాటల్ని ప్రధాన యాజకునికి చెప్పడానికి సమూయేలు భయపడ్డాడు. కానీ ఏలీ అతనిని పిలిపించి ఇలా అడిగాడు: ‘నాన్నా, యెహోవా నీతో ఏమి చెప్పాడు? అన్నీ నాకు చెప్పు.’ సమూయేలు అతనికి మొత్తం చెప్పాడు.
సమూయేలు పెరిగే కొద్దీ, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోవా సమూయేలును ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడని దేశం ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇశ్రాయేలీయులందరికీ తెలుసు.
“కాబట్టి, నీ యౌవనకాలంలోనే నీ మహాగొప్ప సృష్టికర్తను గుర్తుచేసుకో.”—ప్రసంగి 12:1