34వ అధ్యాయం
యేసు పన్నెండుమంది అపొస్తలుల్ని ఎంచుకున్నాడు
పన్నెండుమంది అపొస్తలులు
బాప్తిస్మమిచ్చే యోహాను యేసును దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసి దాదాపు ఒకటిన్నర సంవత్సరం గడిచింది. యేసు పరిచర్య మొదలుపెట్టాక నిజాయితీగల కొంతమంది ఆయన శిష్యులయ్యారు. వాళ్లెవరంటే: అంద్రెయ, సీమోను పేతురు, యోహాను, బహుశా యాకోబు (యోహాను సహోదరుడు), ఫిలిప్పు, నతనయేలు (ఇతనికి బర్తొలొమయి అనే పేరు కూడా ఉంది). తర్వాత, చాలామంది క్రీస్తును అనుసరించడం మొదలుపెట్టారు.—యోహాను 1:45-47.
యేసు ఇప్పుడు తన అపొస్తలుల్ని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్లు ఆయనకు సన్నిహిత స్నేహితులుగా ఉంటూ ప్రత్యేక శిక్షణ పొందుతారు. అయితే వాళ్లను ఎంచుకునే ముందు, యేసు ఒక కొండ మీదికి వెళ్లాడు. అది గలిలయ సముద్ర తీరాన కపెర్నహూముకు దగ్గర్లో ఉండివుంటుంది. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి బహుశా తెలివి కోసం, దేవుని ఆశీర్వాదం కోసం అడిగివుంటాడు. మరుసటి రోజు ఆయన తన శిష్యుల్ని పిలిచి, వాళ్లలో 12 మందిని అపొస్తలులుగా ఎంచుకున్నాడు.
పైన చెప్పుకున్న ఆరుగురితో పాటు, పన్ను వసూలుచేసే కార్యాలయం దగ్గర తాను పిలిచిన మత్తయిని కూడా యేసు ఎంచుకున్నాడు. మిగతా ఐదుగురు ఎవరంటే: యూదా (ఇతన్ని తద్దయి, “యాకోబు కుమారుడు” అని కూడా అంటారు), కననేయుడైన సీమోను, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, ఇస్కరియోతు యూదా.—మత్తయి 10:2-4; లూకా 6:16.
అప్పటికే ఆ 12 మంది యేసుతో కలిసి ప్రయాణించారు కాబట్టి వాళ్ల గురించి ఆయనకు బాగా తెలుసు. వాళ్లలో కొందరు యేసు బంధువులు. అన్నదమ్ములైన యాకోబు యోహానులు వరసకు యేసుకు సహోదరులౌతారు. ఒకవేళ కొందరు అనుకుంటున్నట్టు, అల్ఫయి యేసును పెంచిన తండ్రైన యోసేపుకు సహోదరుడైవుంటే, అల్ఫయి కుమారుడూ అపొస్తలుడూ అయిన యాకోబు కూడా వరసకు యేసుకు సహోదరుడౌతాడు.
అపొస్తలుల పేర్లు గుర్తుపెట్టుకోవడం యేసుకు కష్టమేమీ కాదు. మరి మీరు వాళ్ల పేర్లు గుర్తుపెట్టుకోగలరా? ఒక చిట్కా ఏంటంటే ఇద్దరు సీమోనులు, ఇద్దరు యాకోబులు, ఇద్దరు యూదాలు ఉన్నారు. సీమోనుకు (పేతురుకు) అంద్రెయ అనే సహోదరుడు ఉన్నాడు, యాకోబుకు (జెబెదయి కుమారుడికి) యోహాను అనే సహోదరుడు ఉన్నాడు. ఎనిమిది మంది అపొస్తలుల్ని గుర్తుపెట్టుకోవడానికి అదో చిట్కా. మిగతా నలుగురు ఎవరంటే: పన్ను వసూలుచేసే మత్తయి, సందేహపడిన తోమా, చెట్టు కింద ఉన్నప్పుడు పిలవబడిన నతనయేలు, నతనయేలు స్నేహితుడు ఫిలిప్పు.
అపొస్తలుల్లో 11 మంది యేసు సొంత ప్రాంతమైన గలిలయవాళ్లే. నతనయేలు కానాకు చెందినవాడు. ఫిలిప్పు, పేతురు, అంద్రెయ బేత్సయిదా నగరంవాళ్లు. కానీ కొంతకాలానికి పేతురు, అంద్రెయ కపెర్నహూముకు వెళ్లి స్థిరపడ్డారు. బహుశా మత్తయి కూడా అక్కడివాడే అయ్యుంటాడు. యాకోబు, యోహానులు కూడా కపెర్నహూములో లేదా దాని దగ్గర్లో నివసించేవాళ్లు, అక్కడికి దగ్గర్లోనే చేపల వ్యాపారం చేసేవాళ్లు. యేసును అప్పగించే ఇస్కరియోతు యూదా ఒక్కడే యూదయకు చెందినవాడు అయ్యుంటాడు.