48వ అధ్యాయం
దేవుని శాంతియుతమైన క్రొత్త లోకం —అందులో జీవించాలంటే మీరు ఏంచేయాలి?
దేవుడు ఆదాముకు, హవ్వకు ఏదెను తోటను ఇచ్చాడు. వాళ్లు తన మాట వినకుండా చనిపోయినా, వాళ్ల పిల్లలందరూ పరదైసులో ఎప్పటికీ జీవించే అవకాశం దేవుడు కల్పించాడు. ఆ పిల్లల్లో ఇప్పుడు జీవిస్తున్న మనం కూడా ఉన్నాం. ‘నీతిమంతులకు భూమి సొంతమవుతుంది. వాళ్లు అందులో నిత్యం నివసిస్తారు’ అని బైబిలు మాట ఇస్తోంది.—కీర్తన 37:29.
బైబిలు, “క్రొత్త ఆకాశము,” “క్రొత్త భూమి” గురించి మాట్లాడుతోంది. (యెషయా 65:17; 2 పేతురు 3:13) ఇప్పుడున్న “ఆకాశము” నేడున్న మనుషుల ప్రభుత్వాలను సూచిస్తుంది. అయితే, “క్రొత్త ఆకాశము” పరలోకం నుండి యేసుక్రీస్తు, ఆయన తోటి రాజులు చేసే పరిపాలనను సూచిస్తుంది. శాంతిని తీసుకొచ్చే, దేవుని నీతియుక్త ప్రభుత్వమైన ఈ క్రొత్త ఆకాశం, భూమిని పరిపాలించినప్పుడు ఎంత బావుంటుందో!
“క్రొత్త భూమి” అంటే ఏమిటి?— యెహోవాను ప్రేమించే మంచి ప్రజలు అందరూ కలిపి క్రొత్త భూమి అవుతారు. బైబిలు “భూమి” అని చెప్పినప్పుడు, అది ఎప్పుడూ నేలను ఉద్ధేశించే కాదుగానీ కొన్నిసార్లు మనుషులను ఉద్దేశించి అలా మాట్లాడుతుంది. (ఆదికాండము 11:1; కీర్తన 66:4; 96:1) కాబట్టి, క్రొత్త భూమి ఎవరిని సూచిస్తుందో ఆ ప్రజలు ఇదే భూమ్మీద జీవిస్తారు.
ఇప్పుడున్న చెడ్డ లోకం అప్పుడిక ఉండదు. గుర్తుందా, నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఒక చెడ్డ లోకం పూర్తిగా నాశనమైపోయింది. మనం ముందు తెలుసుకున్నట్లు, ఇప్పుడున్న చెడ్డ లోకం అర్మగిద్దోనులో నాశనం చేయబడుతుంది. అర్మగిద్దోను ముగిసిన తర్వాత దేవుని క్రొత్త లోకంలో జీవించడం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
పరదైసులో, అంటే దేవుని శాంతియుతమైన క్రొత్త లోకంలో ఎప్పటికీ జీవించివుండాలని మీరు కోరుకుంటున్నారా?— అయితే, మనం ఎప్పటికీ జీవించేలా వైద్యులెవ్వరూ చేయలేరు. మనం చనిపోకుండా చేయగల మందు ఏదీ లేదు. మనం ఎప్పటికీ జీవించాలంటే దేవునికి దగ్గరవ్వడం ఒక్కటే మార్గం. మనం దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చో మన గొప్ప బోధకుడు చెప్పాడు.
మనం బైబిళ్లు తీసి యోహాను 17వ అధ్యాయం, 3వ వచనం చదువుదాం. అక్కడ మన గొప్ప బోధకుడు ఇలా చెప్పాడు, “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”
కాబట్టి, మనం ఎప్పటికీ జీవించివుండాలంటే ఏమి చేయాలని యేసు చెప్పాడు?— ముందుగా మనం, మన పరలోక తండ్రియైన యెహోవా గురించి, మనకోసం ప్రాణమిచ్చిన ఆయన కుమారుని గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే బైబిలు ఏంచెప్తుందో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి, గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి అనే ఈ పుస్తకం మనకు సహాయం చేస్తుంది.
కానీ, యెహోవా గురించి తెలుసుకోవడానికీ మనం ఎప్పుడూ జీవించి ఉండడానికీ సంబంధం ఏమిటి?— మనకు ప్రతిరోజూ ఆహారం అవసరమైనట్లే, మనం ప్రతిరోజూ యెహోవా గురించి తెలుసుకోవడం అవసరం. ‘మనుషులు రొట్టెవల్ల మాత్రమే కాదుగానీ యెహోవా నోటి నుండి వచ్చే ప్రతిమాట వల్లా జీవిస్తారు’ అని బైబిలు చెప్తోంది.—మత్తయి 4:4.
మన పాపాన్ని తీసివేయడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు కాబట్టి, మనం ఆయన గురించి కూడా జ్ఞానం సంపాదించుకోవాలి. ‘మరి ఎవరివల్లా రక్షణ కలగదు’ అని బైబిలు చెప్తోంది. ‘కుమారుని మీద విశ్వాసం ఉంచేవాళ్లే నిత్యజీవం కలవాళ్లు’ అని కూడా బైబిలు చెప్తోంది. (అపొస్తలుల కార్యములు 4:12; యోహాను 3:36) యేసు మీద ‘విశ్వాసం ఉంచడం’ అంటే ఏమిటి?— అంటే మనం యేసు మీద నిజంగా నమ్మకం ఉంచాలి, ఆయన లేనిదే మనం ఎప్పటికీ జీవించివుండడం సాధ్యం కాదని తెలుసుకోవాలి. మనం అది నమ్ముతున్నామా?— మనం నమ్మితే, మన గొప్ప బోధకుని నుండి ప్రతిరోజూ నేర్చుకుంటూ ఆయన చెప్పినవి చేస్తాం.
గొప్ప బోధకుని దగ్గర నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఏమిటంటే, ఈ పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదవాలి, దీనిలోవున్న చిత్రాలన్నీ చూసి వాటి గురించి ఆలోచించాలి. ఈ చిత్రాల పక్కనున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి. ఈ పుస్తకాన్ని మీ అమ్మతోగానీ, మీ నాన్నతోగానీ కలిసి చదవండి. మీ అమ్మానాన్నలు మీ దగ్గర లేకపోతే వేరే పెద్దవాళ్లతో కలిసి చదవండి. వేరే పిల్లలతో కూడా కలిసి చదవండి. దేవుని క్రొత్త లోకంలో ఎప్పటికీ జీవించి ఉండాలంటే ఏంచేయాలో, మన గొప్ప బోధకుని నుండి నేర్చుకోవడానికి వేరేవాళ్లకు సహాయం చేయడం చాలా బాగుంటుంది, అవునా?—
‘లోకం గతించిపోతుంది’ అని బైబిలు చెప్తోంది. అయితే, దేవుని క్రొత్త లోకంలో ఎప్పటికీ జీవించి ఉండాలంటే మనం ఏంచేయాలో బైబిలు వివరిస్తోంది. అది, ‘దేవుని చిత్తం చేసేవాళ్లు నిరంతరం నిలుస్తారు’ అని చెప్తోంది. (1 యోహాను 2:17) కాబట్టి, దేవుని క్రొత్త లోకంలో ఎప్పటికీ జీవించి ఉండాలంటే మనం ఏంచేయాలి?— సరిగ్గా చెప్పారు, యెహోవా గురించి, ఆయన ప్రియ కుమారుడైన యేసు గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంతేకాదు, మనం నేర్చుకున్న వాటిని పాటించాలి. అలా చేయడానికి మీకు ఈ పుస్తకం సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం.